భారత్‌లో నోలన్ సినిమా క్రేజ్.. 'ది ఒడిస్సీ' టికెట్ ధర రూ. 3,300.. అయినా హాట్ కేకుల్లా అమ్మకాలు!

  • క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా 'ది ఒడిస్సీ' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం
  • ముంబై, పూణె నగరాల్లో రూ. 3,300 వరకు చేరిన ఐమ్యాక్స్ టికెట్ ధరలు
  • అధిక ధరలు ఉన్నప్పటికీ నిమిషాల్లోనే అమ్ముడవుతున్న వైనం
  • టికెట్ ధరలపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య వాడివేడి చర్చ
  • జులై 17న విడుదల కానున్న ఈ చిత్రంలో భారీ తారాగణం
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ సినిమా వస్తోందంటే ఆ సందడే వేరు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న కొత్త చిత్రం 'ది ఒడిస్సీ' విషయంలోనూ ఇదే జరుగుతోంది. నిన్న‌ (జూన్ 8న) భారత్‌లో ఈ సినిమా ఐమ్యాక్స్ షోల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, టికెట్ ధరలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముంబై, పూణె వంటి నగరాల్లో ప్రీమియం సీట్ల ధరలు ఏకంగా రూ. 3,000 నుంచి రూ. 3,300 వరకు పలుకుతున్నాయి. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సినిమా టికెట్లలో ఇవే అత్యంత ఖరీదైనవి కావడం గమనార్హం.

అయితే, ధరలు ఆకాశాన్నంటుతున్నా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల వ్యవధిలోనే పలు షోలకు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇది చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, నగరాల మధ్య టికెట్ ధరల్లో ఇంత భారీ వ్యత్యాసం ఉండటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఒకే సినిమా అనుభూతికి ఒక్కో నగరంలో ఒక్కో ధర ఎందుకుందని చాలా మంది అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రేజ్‌పై 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా అభిమానులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. "భారత్‌లో ఇప్పటివరకు ఎన్నడూ చూడని అత్యధిక టికెట్ ధర ఇది. నోలన్ ఒక పెద్ద బ్రాండ్ అనడానికి ఇదే నిదర్శనం" అని ఒక యూజర్ పోస్ట్ చేశారు. "భారత్‌లో ప్రమోషన్ కోసం చిత్రబృందం రాకపోయినా టికెట్లు నిమిషాల్లో అమ్ముడయ్యాయి. కేవలం పేరుతోనే సినిమాను అమ్మగలగడం క్రిస్టోఫర్ నోలన్ లెగసీ" అని మరో అభిమాని కామెంట్ చేశారు. కొందరైతే, నోలన్ సినిమాలు చిత్రీకరించే ఐమ్యాక్స్ 70mm ఫార్మాట్‌లో ప్రదర్శించే థియేటర్లు భారత్‌లో చాలా తక్కువగా ఉన్నాయనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.

'ది ఒడిస్సీ' విశేషాలు
అకాడమీ అవార్డు గ్రహీత క్రిస్టోఫర్ నోలన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. గ్రీకు కవి హోమర్ రాసిన ఇతిహాసం 'ఒడిస్సీ' ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ట్రాయ్ పతనం తర్వాత తన స్వస్థలమైన ఇథాకాకు తిరిగి వెళ్లేందుకు రాజు ఒడిస్సియస్ చేసిన ప్రమాదకర ప్రయాణమే ఈ చిత్ర కథ. ఒడిస్సియస్‌గా మ్యాట్ డామన్, ఆయన కుమారుడు టెలిమాకస్‌గా టామ్ హాలండ్, భార్య పెనెలోప్‌గా యాన్ హాత్వే నటిస్తున్నారు.

వీరితో పాటు జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపిటా యోంగో, చార్లీజ్ థెరాన్, జోన్ బెర్న్‌తాల్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో ఉంది. నోలన్, ఎమ్మా థామస్ తమ సొంత బ్యానర్ సింకాపీపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జులై 17న విడుదల కానుంది.

Christopher Nolan
The Odyssey movie
IMAX ticket prices India
Tom Holland Matt Damon
Nolan movie advance bookings
The Odyssey India release

More Telugu News